మంగళగిరిలో మానవ మృగాలు

మంగళగిరిలో మానవ మృగాలు

కన్ను మిన్నూ కానని ..కామాంధులు..!

.24 గంటల వ్యవధిలో మూడు అత్యాచార యత్నాలు.

చిన్నారులను చెర బడుతున్న నీచులు.. నికృష్టులు..

ముగ్గురుపై పొక్సో  కేసు నమోదు చేసిన  పోలీసులు..

మంగళగిరి ( జర్నలిస్ట్ ఫైల్ ) : మానవ రూపంలో తోడేళ్లు సంచరిస్తున్నాయి. అదను చూసి పసి మొగ్గల బ్రతుకులను చిద్రం చేస్తున్నాయి  కాలనాగుల్లా వారి శీలాన్ని కాటు వేసి ,విషాన్ని గ్రక్కుతున్నాయి.

మదమెక్కిన కామాంధులకు కన్ను మిన్ను కానరాటం లేదు. లేత గులాబీ మొగ్గలను చిదిమేస్తున్నారు. మూడేళ్ల పసి మొగ్గల నుండి 60 ఏళ్ల ముదుసలి వారిని కూడా వదలడం లేదు. అత్యాచారాలకు తెగబడుతున్నారు .వావి వరసలు మరిచి పోతున్నారు. తల్లి, అక్క, చెల్లి, కూతురు అనే వావి వరసలు కూడా మర్చిపోతున్నారు. పశువుల్లా మీద పడుతున్నారు. కామంతో కాటువేస్తున్నారు. చట్టాలు కఠినంగా ఉన్న కామాంధుల పైశాచికత్వం మారడం లేదు. మానవ మృగాల మధ్య అభల ఆర్తనాదాలు చెవిటి వాని ముందు శంఖం మాదిరి అవుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట, ఎక్కడో ఒకచోట పసి మొగ్గలు, చిన్నారులు, మహిళలు మానవ మృగాల కర్కశ చేతుల్లో నలిగి పోతున్నారు. నిత్యం మహిళ బలి అవుతూనే ఉంది. పశ్చిమ బెంగాల్లో ఓ మానవ మృగం యువ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని కుదిపేస్తున్నది.
 
తాజాగా మంగళగిరిలో ఒకే రోజు ముగ్గురు పిల్లలపై కామాంధులు అత్యాచారయత్నం ఈ ప్రాంతాన్ని కుదిపేస్తున్నది. పోలీసులు కామాంధులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపారు. 
 
వివరాలు ఇవే..!

 

మంగళగిరి నియోజకవర్గంలో ముగ్గురు మైనర్ బాలికలపై కామాంధులు విరుచుకుపడ్డారు.24 గంటల వ్యవధిలో మూడు అత్యాచార యత్నాలు జరగటం ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి..
 
 

కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు చిన్న...పెద్ద తారతమ్యం లేకుండా మైనర్ బాలికలపై అత్యాచారయత్నాలకు పాల్పడిన ఇలాంటి వారిపై కఠిన నిర్ణయాలు తీసుకొనే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు..

గడిచిన 24 గంటల వ్యవధిలో ముగ్గురు కామాంధులు అత్యాచార యత్నం చేయగా వారిపై మంగళగిరి పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద శుక్రవారం కేసు నమోదు చేశారు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి నగర పరిధిలోని రత్నాలచెరువు బిఎన్ఆర్ ప్రభుత్వ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల గుంటూరు వెంకటేశ్వరరావు అత్యాచారయత్నంకి పాల్పడ్డాడు ..శుక్రవారం ఉదయం మైనర్ బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లగా ఒంటరిగా నిద్రపోతున్న మైనర్ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు..ఇంతలో నిద్రలేచి మేలుకొన్న బాలిక బిగ్గరగా  అరిచి ఆ వ్యక్తిని ప్రతిఘటించి బయటకు పరిగెత్తింది.పక్కింటి వారికి ఉన్న విషయం చెప్పి బోరున ఏడ్చేసింది.విషయం తెలుసుకున్న పక్కింటి వాళ్ళు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఆ వ్యక్తిపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు.

బాలాజీ నగర్ లో.

అదే విధంగా మంగళగిరి నగర పరిధిలోని బాలాజీ నగర్ లో నివాసం ఉంటున్న ఏదేళ్ళ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన కూడా శుక్రవారం చోటు చేసుకుంది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇంట్లో ఒంటిరిగా ఉన్న బాలిక తో అదే ప్రాంతానికి చెందిన వండ్రంగి పని చేసుకునే 60 ఏళ్ల చింతక్రింది వెంకటేశ్వరరావు అనే వ్యక్తి  బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించే సమయంలో బాలిక తల్లిదండ్రులు రావటంతో అక్కడ నుంచి పారిపోయాడు.పోలీసు స్టేషన్ కి చేరుకొన్న తల్లితండ్రులు జరిగిన విషయాన్ని చెప్పటంతో తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి వ్యక్తిని రిమాండ్ కి పంపారు.

రూరల్ పరిధిలో..

పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన గాడిదపాటి రాజు అనే వ్యక్తి అపార్ట్మెంట్ లకు వాచ్మెన్ గా పనిచేస్తూన్నాడు.రాజుకి  13 సంవత్సరాల కూతురు నంబూరులో 5వ తరగతి చదువుతుంది. గతంలో మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో ఒక అపార్ట్మెంట్ కు వాచ్మెన్ గా పనిచేస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన తాటి రూపేంద్ర ప్రభు అనే వ్యక్తి తన కూతుర్ని వెంబడించి ప్రేమించమని ఇబ్బంది పెట్టి..వేధించేవాడు. మైనర్ బాలిక తండ్రి ఫిర్యాధు మేరకు  కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని హెచ్చరించారు.అయిన పట్టించుకోకుండా గత రెండు రోజులు క్రితం ఇంట్లో ఎవరు లేని సమయంలో  బాలికను ద్విచక్ర వాహనం పై బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేసినట్లు బాలిక తండ్రి రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసుని దర్యాప్తు చేసిన పోలీసులు రూపేంద్రని అరెస్టు చేసి అతనిపై కిడ్నాప్ కేసుతో పాటు పోక్సో యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపినట్లు పోలీసులు పేర్కొన్నారు.రూపేంద్ర పై గతంలో గంజాయి,లిక్కర్ కేసులు ఉన్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.

కామాంధుల కళ్ళు పసి మొగ్గల కోసం వెంటాడుతూనే ఉన్నాయి ఒంటరిగా దొరికితే తోడేళ్లు లా మీద పడుతున్నాయి. వారి బతుకులు చిద్రం చేస్తున్నాయి .పిల్లలూ.. తల్లిదండ్రులారా తస్మాత్ జాగ్రత్త..!!

About The Author

Related Posts

Latest News